Tuesday 19 May 2015

అధికారుల సహకారంతోనే ఎర్రచందనం కొనుగోలు చేశా

కడప: అధికారుల సహకారంతోనే ఎర్రచందనం కొనుగోలు చేశా- స్మగ్లర్‌ ముఖేష్‌ బదానియా

కడప, మే 19 : కొందరు అధికారుల సహకారంతోనే ఎర్రచందనం కొనుగోలు చేశానని హర్యానాకు చెందిన స్మగ్లర్‌ ముఖేష్‌ బదానియా సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ముఖేష్‌ బదానియా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు ఎర్రచందనం కొనుగోలుకు మధ్యవర్తులుగా వ్యవహరించారని, తన వద్ద కమీషన్‌లు తీసుకొని సహకరించారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం కొనుగోలు చేశానని, వాటిని ముక్కలుగా కట్‌ చేసి అమ్మేవాడినన్నారు. ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి మీకు తెలుసా అన్న ప్రశ్నకు ముఖేష్‌ బదానియా నవ్వి ఊరుకున్నాడు. ఎమ్మెల్యేలు, స్మగ్లర్‌లతో సంబంధాలపై మాట్లాడేందుకు ముఖేష్‌ బదానియా నిరాకరించారు. తాను ప్రభుత్వం వద్ద అధికారికంగానే ఎర్రచందనాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. కాగా ఎర్రచందనం దుంగలు అక్రమంగా కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కొనుగోలుకు చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు స్థానిక నేతలు, అటవీశాఖ ఉద్యోగులు సహకరించారని ఆయన ఆరోపించారు. అధికారులు, నాయకులు తన వెనుక ఉన్నారని ముఖేష్‌ బదానియా వ్యాఖ్యానించారు. తానిచ్చే కమీషన్ల కోసం అధికారులు కక్కుర్తి పడ్డారని ఆయన చెప్పారు. జిల్లా నాయకుల సహకారం లేకుండా తానెలా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్‌ చేస్తానని ముఖేష్‌ బదానియా ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డా అని ఆయన వ్యాఖ్యానించారు.

Saturday 9 May 2015

చిత్తూరు పోలీసుల ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో చైనా స్మగ్లర్‌ అరెస్టు

చిత్తూరు పోలీసుల ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో చైనా స్మగ్లర్‌ అరెస్టు

తిరుపతి, చిత్తూరు టౌన్‌/కాకినాడ క్రైం, మే 8(ఆంధ్రజ్యోతి): చిత్తూరు పోలీసులు విదేశీ స్మగ్లర్లపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. చైనా దేశానికి చెందిన స్మగ్లర్‌ను గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో ఒక విదేశీ స్మగ్లర్‌ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి. చిత్తూరు స్పెషల్‌ పార్టీ పోలీసులకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో స్మగ్లర్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చైనా స్మగ్లర్‌ యాంగ్‌ పాంగ్‌తోపాటు కడప జిల్లా రాయచోటికి చెందిన శ్రీనివాసరాజును అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. వారి నుంచి 30 కిలోల రెండు దుంగలు, చైనా కరెన్సీ, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారిలో ఎర్రావారిపాళ్యంకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌, హైదరాబాద్‌కు చెందిన కిషోర్‌ కుమార్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. కాగా, శ్రీనివాసరాజు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగినా ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆగలేదని డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆయన మాట్లాడుతూ స్మగ్లింగ్‌ను అడ్డుకునే క్రమంలో ఇప్పటివరకు 4500 మందిని అరెస్టు చేశామన్నారు.